వచనము
అది యెట్లనిన నొక్కనాఁడు జలక్రీడాపరిశ్రమవిచేష్టితుండయి ప్రమాణకోటిస్థలంబున నిద్రితుండైన భీమసేనునతిఘనలతాపాశబద్ధుం జేసి గంగమడువునం ద్రోచిన నాతం డనంతసత్త్వుండు గావునఁ దద్బంధంబు లెల్లఁ దెగ నీల్గి మీఁదికి నెగసె మఱియొక్కనాఁ డతివ్యాయామఖేదంబున సుప్తుండైన వానిసర్వాంగంబులయందుఁ గృష్ణసర్పంబులం బట్టి కఱపించిన నాతండు వజ్రమయదేహుండు గావునఁ దద్విషదంష్ట్రలు నాఁటవయ్యె మఱియు నొక్కనాఁడు భోజన సమయంబున వానికి విషంబు వెట్టిన నతండు దివ్యపురుషుండు గావునఁ దద్విషం బన్నంబుతోడన జీర్ణం బయ్యె మఱియు వారల కెల్ల నపాయంబు సేయసమకట్టి.
(అదెలాగంటే, జలక్రీడలాడి, అలసి, ప్రమాణకోటి అనే చోట నిద్రపోతున్న భీముడిని తీగలతో బంధించి గంగానది మడుగులో తోసినా అతడు అనంతబలవంతుడు కాబట్టి నిద్రలేచి, ఒళ్లు విరుచుకొని బయటికి వచ్చాడు. మరొక రోజు, వ్యాయమం చేసి నిద్రపోతున్న భీముడిని నల్లత్రాచులతో కాటువేయించగా అతడు వజ్రదేహుడు కాబట్టి ఆ పాముల కోరలు అతడి శరీరంలో దిగబడలేదు. భీముడికి భోజనంలో విషం కలిపిపెట్టినా అది అతనికి అన్నంతోపాటే జీర్ణమైపోయింది.అయినా, కౌరవులు వారికి హాని చేయాలని.)
No comments:
Post a Comment