వచనము
కావున నాకు నీజన్మంబునఁ బతి యయాతియ యితండును భవద్వచనంబున నన్ను వివాహం బగుదుననియె నిందు ధర్మవిరోధంబు లేకుండునట్లుగాఁ బ్రసాదింప వలయు ననిన శుక్రుండు గరుణించి యయాతికి నీకును నయిన యీ వివాహంబునం దపక్రమదోషంబు లేకుండెడుమని వరంబిచ్చి యయ్యిరువురకుం బరమోత్సవంబున వివాహంబు సేసి శర్మిష్ఠం జూపి యిది వృషపర్వుని కూఁతురు దీనికిం బ్రియంబున నన్నపానభూషణాచ్ఛాదనమాల్యాను లేపనాదుల సంతోషంబు సేయునది శయనవిషయంబునఁ బరిహరించునది యని పంచి కూఁతు నల్లునిం బూజించిన నయ్యయాతియు శుక్రుని వీడ్కొని దేవయానిని శర్మిష్ఠను గన్యకాసహస్రంబును దోడ్కొని నిజపురంబునకుం జని యంతఃపురరమ్యహర్మ్యతలంబున దేవయాని నునిచి తదనుమతంబున నశోకవనికాసమీపంబున నొక్కగృహంబు నందుఁ గన్యకాసహస్రంబుతో శర్మిష్ఠ నునిచి దేవయానియందు సుఖోపభోగపరుం డై యున్నఁ గొండొకకాలంబునకు దేవయానికి యదుతుర్వసులను కొడుకులు పుట్టి రంత శర్మిష్ఠ సంప్రాప్తయౌవనయు ఋతుమతియునై యాత్మగతంబున.
(మా వివాహం ధర్మవిరుద్ధం కాకుండా అనుగ్రహించాలి అనగా శుక్రుడు ఆ ప్రకారంగా వరమిచ్చి వారి పెళ్లి జరిపించి, యయాతికి శర్మిష్ఠను చూపించి, "ఈమెకు అన్నపానాదివిషయాల్లో సంతోషం కలిగించు, శయనవిషయంలో వదిలిపెట్టు", అని ఆజ్ఞాపించాడు. యయాతి దేవయానిని ఒక అందమైన మేడలో ఉంచి, శర్మిష్ఠ మొదలైనవారిని ఇంకొక ఇంట్లో ఉంచాడు. కొంతకాలానికి దేవయానికి యదువు, తుర్వసుడు అనే కొడుకులు పుట్టారు. కొంతకాలానికి శర్మిష్ఠ యౌవనవతై.)
No comments:
Post a Comment