వచనము
ఇట్లు క్రమంబునం బుట్టిన ధృతరాష్ట్ర పాండుకుమారులకు బ్రాహ్మణసమేతుం డై భీష్ముండు జాతకకర్మాదిక్రియ లొనరించినంత నాంబికేయు జాత్యంధుం జూచి దుఃఖిత యయి సత్యవతి వెండియుఁ బారాశర్యుం దలంచుడు నాక్షణంబ యమ్మునివరుండు వచ్చి పని యేమి యని యన్న నీయంబికకుఁ బ్రథమపుత్త్రుం డంధుం డయ్యె నింక నొక్క కొడుకు రూపవంతుం బడయు మనిన నియతాత్మ యగునేని సుపుత్త్రుండు పుట్టుననవుడు సత్యవతి తొల్లింటియట్ల కోడలి నియోగించిన నక్కోమలి యమ్మునివరు వికృతవేషరూపగంధంబుల కోపక రోసి తనదాసి ననేక భూషణాలంకృతం జేసి తనశయనతలంబున నుండం బంచిన వ్యాసభట్టారకుండు వచ్చి దాని చేసిన యిష్టోపభోగంబులం దుష్టుండై దానికిం బుత్త్రదానంబు సేసిన.
(ఇలా వీరిద్దరూ పుట్టగా భీష్ముడు వారికి జాతకర్మ మొదలైన సంస్కారాలను జరిపించాడు. అంబిక కొడుకు పుట్టుగుడ్డి అని సత్యవతి తెలుసుకొని వ్యాసుడిని మళ్లీ తలచుకోగా అతడు వెంటనే వచ్చాడు. అంబికకు ఇంకొక పుత్రుడిని అనుగ్రహించమని సత్యవతి అతడిని కోరింది. వ్యాసుడి వికారమైన వేషాన్ని అంబిక అసహ్యించుకొని తను వెళ్లకుండా తన దాసిని పంపింది. వ్యాసుడు ఆమెకు పుత్రసంతానాన్ని ప్రసాదించాడు.)
No comments:
Post a Comment