వచనము
అనిన నవనతానన యయి నాగకన్యక యర్జునుం జూచి ద్రుపదరాజపుత్త్రియందు మీచేసిన సమయంబును భవత్తీర్థాగమననిమిత్తంబును వ్రతంబును నెఱుంగనిదానఁ గాను సర్వతీర్థ సేవంబును సర్వవ్రతంబులు సలుపుటయును సర్వదాన ధర్మక్రియలును బ్రాణదానంబుతో సమానంబులు గావు నామనోరథంబు విఫలం బయిన మనోజానలంబునం బ్రాణపరిత్యాగం బగుం గావున నన్ను రక్షింపుము దీన నీకు వ్రతభంగంబు గా దనిన నర్జునుండు దానిమనోరథంబు సలిపి యారాత్రి నాగభువనంబున వసియించి నాగకన్యకయందు సద్యోగర్భంబున నిరావంతుం డను కొడుకుం బడసి నాగలోకంబు వెలువడి యాదిత్యోదయంబుతోడన గంగాద్వారంబునకు వచ్చి తద్వృత్తాంతం బంతయుఁ దనసహాయు లయిన విప్రులకుం జెప్పి వారలకు హృదయానందంబు సేయుచు.
(అప్పుడు ఉలూచి - మీ వ్రతం తెలియని దాన్ని కాను. కానీ ఈ వ్రతాలేవీ ప్రాణదానంతో సమానం కావు. నా కోరిక నెరవేరకపోతే నేను ప్రాణత్యాగం చేస్తాను. కాబట్టి నన్ను రక్షించు, నీకు వ్రతభంగం కాదు - అనగా అర్జునుడు అంగీకరించాడు. ఆమె వల్ల ఇరావంతుడు అనే పుత్రుడిని అప్పటికప్పుడే పొంది సూర్యోదయం కాగానే గంగాద్వారానికి చేరి జరిగిన వృత్తాంతం తనకు తోడుగా ఉన్న విప్రులకు చెప్పాడు.)
No comments:
Post a Comment