సీసము
అబ్జజు వీడ్కొని యది దేవసభకుఁ బ్ర
దక్షిణం బొనరించెఁ దత్క్షణంబ
తద్రూపసౌందర్యదర్శనలోలుఁ డై
యజుఁడు నాలుగుదిక్కులందుఁ దనకు
గావించుకొనియె ముఖంబులు మఱిరెండు
కన్నులఁ జూచినం గాదు తృప్తి
యని సురేంద్రుండు సహస్రాక్షుఁ డయ్యె న
య్యమరులు కామమోహాంధు లైరి
ఆటవెలది
ముదిత యిట్లు సర్వమోహిని యై మర్త్య
భువమునకు మెఱుఁగుఁ బోలె నొప్పి
యరుగుదెంచె సుందరాంగి వింధ్యాచల
విపినదేశ మెల్ల వెలుఁగుచుండ.
(తిలోత్తమ బ్రహ్మ దగ్గర సెలవు తీసుకొని దేవసభకు ప్రదక్షిణం చేయగా ఆమె సౌందర్యం చూడటానికి తనకు నాలుగు ముఖాలు సృష్టించుకొని చతుర్ముఖుడయ్యాడు. ఇంద్రుడు రెండుకళ్లు చాలవని వేయి కళ్లు కలవాడయ్యాడు. దేవతలందరూ కామమోహితులయ్యారు. ఇలా అందరినీ మోహింపజేసి తిలోత్తమ వింధ్యపర్వతప్రాంతానికి వచ్చింది.)
No comments:
Post a Comment