Friday, October 21, 2005

1_3_12 సీసము + ఆటవెలది విజయ్ - విక్రమాదిత్య

సీసము

పాండుకుమారులు పాండుభూపతిపరో
        క్షంబున హస్తిపురంబునందు
ధృతరాష్ట్రునొద్దఁ దత్సుతులతో నొక్కటఁ
        బెరుఁగుచు భూసురవరులవలన
వేదంబులును ధనుర్వేదాదివిద్యలుఁ
        గఱచుచుఁ గడలేనియెఱుకఁ దనరు
చున్నఁ దద్విపులగుణోన్నతి సైఁపక
        దుర్యోధనుండు దుష్కార్య మెత్తి.

ఆటవెలది

దుర్ణయమున శకునికర్ణదుశ్శాసనుల్
గఱపఁ బాండవులకు నఱయ చేయఁ
గడఁగెఁ బాండవులును గడుధార్మికులు గానఁ
బొరయ రైరి వారిదురితవిధుల.

(పాండురాజు చనిపోయిన తర్వాత పాండవులు హస్తినాపురంలో కౌరవులతోపాటు పెరుగుతూ, విద్యలు నేర్చుకుంటూండేవారు. వారిని చూసి దుర్యోధనుడు సహించలేక శకుని, కర్ణుడు, దుశ్శాసనులతో కలిసి పాండవులకు కీడు చేయాలని ప్రయత్నించినా పాండవులు ధార్మికులవటం వల్ల వారికి హాని కలిగేది కాదు.)

No comments: