Tuesday, October 25, 2005

1_3_15 వచనము నచకి - విజయ్

వచనము

ఇట్లు దుర్యోధనుచేయు నపాయంబులవలనం బాయుచుఁ బాండవులు లాక్షాగృహదాహంబువలన నక్షయులై జననీసహితంబుగా వనంబులకుం జనిన నందు భీమసేనుండు హిడింబాసురుం జంపి వాని చెలియలి హిడింబను వివాహంబై యేకచక్రపురంబున కేఁగి యందు బకాసురుం జంపి విప్రులం గాచె మఱి యందఱు విప్రవేషంబున ద్రుపదపురంబునకుం జని యందు ద్రౌపదీస్వయంవరంబున మత్స్యయంత్రం బర్జునుం డశ్రమంబున నురులనేసి సకలరాజలోకంబు నొడిచి ద్రోవదింజేకొనిన దాని నేవురు గురువచనంబున వివాహంబై ద్రుపదుపురంబున నొక్కసంవత్సరం బున్న నెఱింగి ధృతరాష్ట్రుండు వారి రావించి వారల కర్ధరాజ్యంబిచ్చి యింద్రప్రస్థపురంబున నుండం బనిచిన నందుఁ బాండవులు రాజ్యంబు సేయుచున్నంత.

(పాండవులు అలా తప్పించుకొని తల్లితో కూడా అడవులకు వెళ్లారు. అక్కడ భీముడు హిడింబాసురుడిని చంపి, అతడి చెల్లెలైన హిడింబను పెళ్లాడి, ఏకచక్రపురానికి వెళ్లి, బకాసురుడిని చంపాడు. తరువాత పాండవులు విప్రవేషాలలో ద్రుపదపురానికి వెళ్లారు. అక్కడ ద్రౌపది స్వయంవరంలో అర్జునుడు మత్స్యయంత్రాన్ని కొట్టి ద్రౌపదిని గ్రహించాడు. తరువాత గురువచనం ప్రకారం పాండవులందరూ ద్రౌపదిని పెళ్లాడి ఒక సంవత్సరం పాటు ద్రుపదపురంలో ఉన్నారు. ఇది ధృతరాష్ట్రుడు తెలుసుకొని వారిని రప్పించి, సగం రాజ్యం ఇచ్చి ఇంద్రప్రస్థంలో ఉండమని ఆజ్ఞాపించాడు. పాండవులు అక్కడ రాజ్యం చేస్తూ ఉండగా.)

No comments: