Friday, October 28, 2005

1_3_26 వచనము నచకి - విక్రమాదిత్య

వచనము

అట్టి యింద్రోత్సవంబున నతిప్రీతుం డయిన యింద్రువరంబున నుపరిచరుండు బృహద్రథ మణివాహన సౌబల యదు రాజన్యు లనియెడి కొడుకుల నేవురం బడసి వారలం బెక్కు దేశంబుల కభిషిక్తులం జేసిన నయ్యేవురు వాసవులు వేఱు వేఱ వంశకరు లయి పరఁగి ర ట్లుపరిచరుండు లబ్ధసంతానుండయి రాజర్షి యయి రాజ్యంబు సేయుచు నిజపురసమీపంబునం బాఱిన శుక్తిమతి అను మహానదిం గోలాహలం బను పర్వతంబు గామించి యడ్డంబు వడిన దానిం దన పాదంబునం జేసి తలఁగం ద్రోచిన నన్నదికిఁ బర్వతసమాగమంబున వసుపదుం డను కొడుకును గిరిక యను కూఁతురుం బుట్టిన నయ్యిరువురను శుక్తిమతి దద్దయు భక్తిమతియై గిరినిరోధంబు బాచి యుపకారంబు సేసిన యుపరిచరునకు మెచ్చి కానిక యిచ్చిన నాతండు వసుపదుం దనకు సేనాపతిం జేసికొని గిరికం దనకు ధర్మపత్నిగాఁ జేసికొని యున్నంత నగ్గిరిక ఋతుమతి యయిన దీనికి మృగమాంసంబు దెచ్చిపెట్టు మని తన పితృదేవతలు పంచిన నప్పు డయ్యుపరిచరుండు మృగవధార్థంబు వనంబున కరిగి.

(ఉపరిచరుడి ఇంద్రోత్సవాలకు ఇంద్రుడెంతో సంతోషించాడు. ఇంద్రుడి వరం వల్ల అతడికి అయిదుగురు కుమారులు పుట్టి, అనేక దేశాలకు అధిపతులయ్యారు. అలా ఉపరిచరుడు రాజ్యాన్ని పాలిస్తుండగా, దగ్గరలోని శుక్తిమతి అనే నదిని కోలాహలం అనే పర్వతం కామించి అడ్డగించింది. ఉపరిచరుడు తన కాలితో ఆ పర్వతాన్ని తొలగించాడు. పర్వతసమాగమం చేత ఆ నదికి వసుపదుడనే కుమారుడు, గిరిక అనే కూతురు జన్మించగా శుక్తిమతి వారిని ఉపరిచరుడికి కానుకగా ఇచ్చింది. ఆ రాజు వసుపదుడిని తన సేనాపతిగా, గిరికను తన ధర్మపత్నిగా చేసుకున్నాడు. ఋతుమతి అయిన గిరికకు మృగమాంసం తెమ్మని పితృదేవతలు ఆజ్ఞాపించగా అందుకోసం ఉపరిచరుడు అడవికి వెళ్లాడు.)

No comments: