Wednesday, October 26, 2005

1_3_17 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

మఱియు నగ్నిదేవుచేత దివ్యరథంబును దివ్యాశ్వంబులును గాండీవదేవదత్తంబులును నక్షయబాణతూణీరంబులుం బడసి సురగణంబులతో సురపతి నోర్చి ఖాండవదహనంబున నగ్నిదేవునిం దనిపె మఱి మయువలన సభాప్రాప్తుండై భీమునిచేత జరాసంధుం జంపించి దిగ్విజయంబు సేసి సార్వభౌముండై ధర్మరాజు రాజసూయమహాయజ్ఞంబుఁ గావించె నివి మొదలుగాఁ గల పాండవులగుణసంపదలు చూచి సహింప నోపక దుర్యోధనుండు శకునికైతవంబున మాయాద్యూతంబున ధర్మరాజుం బరాజితుం జేసి పండ్రెండేఁడులు వనవాసంబును నొక్కయేఁడు జనపదంబున నజ్ఞాతవాసంబునుగా సమయంబుసేసి భూమి వెలువరించినం జని పాండవులు వనవాసంబున నున్నంత.

(అగ్నిదేవుడి దగ్గర దివ్యరథాన్ని, గాండీవాన్ని, దేవదత్తమనే శంఖాన్ని, అక్షయతూణీరాన్ని పొంది, దేవేంద్రుడిని ఓడించి, ఖాండవదహనం చేసి, అగ్నిదేవుడిని తృప్తుడిని చేశాడు. భీముడి చేత జరాసంధుడిని చంపించి, మయుడి చేత సభాభవనాన్ని పొంది, ధర్మరాజు సార్వభౌముడై రాజసూయయజ్ఞం చేశాడు. ఇది దుర్యోధనుడు సహించలేక శకుని చేత మాయాజూదంలో ధర్మరాజును ఓడించాడు. పన్నెండేళ్లు వనవాసం, ఒక ఏడు అజ్ఞాతవాసం చేయాలనే నియమం ప్రకారం దేశం నుంచి వారిని వెళ్లగొట్టాడు. వారు అడవిలో ఉండగా.)

No comments: