Wednesday, February 22, 2006

1_4_262 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

అని యడిగిన వానికి వైశంపాయనుం డిట్లని చెప్పె మాండవ్యుం డను బ్రహ్మర్షి దొల్లి మహీవలయంబునం గల తీర్థంబు లెల్ల నేకచారి యయి సేవించి యొక్క నగరంబున నెడ గలుగు నడవిలో నాశ్రమంబు గావించి తద్ద్వారవృక్షమూలంబున నూర్ధ్వబాహుం డయి మౌనవ్రతంబునం దపంబు సేయుచున్న నన్నగరంబు రాజు నర్థంబు మ్రుచ్చిలికొని మ్రుచ్చు లారెకులచేత ననుధావ్యమాను లై మాండవ్యుసమీపంబునం బాఱి యయ్యాశ్రమంబులో డాఁగిన వారి వెనుదగిలి వచ్చిన యారెకు లమ్మునిం గని రాజధనాపహారు లయిన చోరులు నీయొద్దన పారి రెటవోయి రెఱుంగుదేని చెప్పుమనిన నమ్ముని మౌనవ్రతుండు గావునఁ బలుకకున్నం గినిసి యయ్యాశ్రమంబులోఁ జొచ్చి వెదకి ధనంబుతోడ నామ్రుచ్చులం బట్టికొని.

(అందుకు వైశంపాయనుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు - పూర్వం మాండవ్యుడు తన ఆశ్రమద్వారం దగ్గర ఉన్న చెట్టు దగ్గర చేతులు పైకెత్తి మౌనవ్రతంతో తపస్సు చేస్తుండగా, రాజధనం దొంగిలించిన కొందరు దొంగలు అతడి ఆశ్రమంలో దాక్కొన్నారు. వారిని వెంటాడుతూ వచ్చిన తలారులు మాండవ్యుడిని దొంగలను గురించి అడిగారు. అతడు మాట్లాడకపోవటంతో, వారు ఆశ్రమంలో వెతికి దొంగలను పట్టుకొని.)

No comments: