Saturday, October 15, 2005

1_2_191 వచనము విజయ్ - విక్రమాదిత్య

వచనము

కశ్యపుండును నప్పుడ యాభస్మచయంబు గూడఁద్రోచి తనమంత్రతంత్రశక్తింజేసి యెప్పటియట్ల వృక్షంబుగాఁ జేసినం జూచి తక్షకుం డతివిస్మయం బంది మునీంద్రా నీవిద్యాబలంబున నిది సంజీవితం బయ్యె నేనియు నతికుపిత విప్రశాపవ్యపగతాయుష్యుం డైన పరీక్షితుండు సంజీవితుండు గానోపండు వానియిచ్చు ధనంబుకంటె నాయం దధికధనంబు గొనిపొ మ్మనినఁ గశ్యపుండును దన దివ్యజ్ఞానంబున నట్లకా నెఱింగి తక్షకుచేత ననంతంబైన యర్థంబు గొని క్రమ్మఱి చనియె విజనం బైన విపినాంతరంబున నైన యయ్యిరువున వృత్తాంతంబు మీరె ట్లెఱింగితి రంటేని వినుము.

(కశ్యపుడు వెంటనే బూడిదగా మారిన ఆ చెట్టును తన మంత్రబలంతో పునర్జీవింపజేశాడు. తక్షకుడు ఆశ్చర్యపోయి, "మునీంద్రా! ఈ చెట్టును బ్రతికించగలిగావేమోగానీ శృంగి శాపం తగిలిన పరీక్షిత్తు చావు తప్పించుకోలేడు. అతడిచ్చే సొమ్ముకన్నా ఎక్కువ నేనిస్తాను. అది తీసుకొని తిరిగివెళ్లు", అనగా కశ్యపుడు అందుకు అంగీకరించి వెళ్లిపోయాడు. జనంలేని అడవిలో జరిగిన ఈ సంభాషణ నాకెలా తెలిసిందని అడుగుతారేమో. వినండి.)

No comments: